ఎస్సీ వర్గీకరణ అమలయ్యే వరకు గ్రూప్-3, గ్రూప్-2 వాయిదా వేయండి.. సీఎం రేవంత్కు ఎస్సీ విద్యార్థుల లేఖ
హైదరాబాద్ అక్టోబర్ 22(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే వరకు గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేసి న్యాయం చేయాలని ఎస్సీ సామాజిక విద్యార్థులు సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ వర్గీకరణ తక్షణమే అమలు చేస్తామని.. త్వరలో జరుగబోయే పరీక్షల్లోనూ వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలులో న్యాయపరమైన చిక్కులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం 12/10/2024 రోజున జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జీవో జారీ చేసిందన్నారు.
ఈ క్రమంలో దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి వర్గీకరణ ఫలాలకు దూరంగా వివక్షకు గురవుతున్న ఎస్సీ సామాజిక ఉపకులాలకు గొప్ప అవకాశం వర్గీకరణ అని తెలిపారు. వర్గీకరణ అమలులోకి వచ్చిన తర్వాతే రాబోయే గ్రూప్-3, గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని.. ఎస్సీ సామాజిక వర్గ ఉపకులాలకు రిజర్వేషన్లు దక్కేలా చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రాబోయే నోటిఫికేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ఖాళీల సంఖ్య ఉండకపోవచ్చని.. వర్గీకరణ అమలు జరిగే వరకు పరీక్షలు వాయిదా వేయాలని.. అదనంగా పోస్టులు కలిసి మిగతా సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని కోరారు.