Praja Kshetram
తెలంగాణ

ఈనెల 26న బీసీల సమస్యలు పరిష్కరించాలంటూ పార్లమెంట్‌ ముట్టడి : ఆర్‌ కృష్ణయ్య

ఈనెల 26న బీసీల సమస్యలు పరిష్కరించాలంటూ పార్లమెంట్‌ ముట్టడి : ఆర్‌ కృష్ణయ్య

 

కాచిగూడ అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం): బీసీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26న బీసీలతో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్‌ కృష్ణయ్య వెల్లడించారు. బీసీలకు సామాజిక న్యాయం చేయకపోతే కేంద్రంపై మిలిటెంట్‌ పోరాటం చేస్తామని ప్రకటించారు. జాతీయ బీసీ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాల నాయకులతో బుధవారం కాచిగూడ అభినందన్‌ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి, జనగణనలో కులగణన చేయాలని డిమాండ్‌ చేశారు. ఉవ్వేత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం కేంద్రం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు పార్లమెంట్‌లో రాజ్యంగ సవరణ చేయాలని కోరారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. వికసిత్‌ భారత్‌ అంటే అంబాని, ఆధాని కాదని, దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలైన బహుజనులను బాగుచేయడమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నంద గోపాల్‌, ఉదయ్‌, నీల వెంకటేశ్‌, రాఘవ, రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.

Related posts