భార్యలు రోడ్డెక్కితే.. భర్తలను సస్పెండ్ చేసే చట్టం ఎక్కాడా లేదు.. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):భార్యలు రోడ్డెక్కితే.. భర్తలను సస్పెండ్ చేసే చట్టం ఎక్కడా లేదు అని రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. నల్లగొండలోని 12వ బెటాలియన్లో కానిస్టేబుళ్ల సస్పెన్షన్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
పోలీసు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ను తక్షణమే ఎత్తేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. నాడు కేసీఆర్ కానిస్టేబుళ్లను మనుషులుగా చూస్తే.. నేడు రేవంత్ వాళ్ళను మరమనుషులుగా చూస్తున్నాడు. రాష్ట్రంలో హోంమంత్రి లేడు, రేవంత్ రెడ్డి దగ్గరే హోం శాఖ ఉంది. రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవంలో పాల్గోన్న రోజే.. పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డు ఎక్కాయి. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు స్పెషల్ కానిస్టేబుల్స్ 15 రోజులు డ్యూటీ చేస్తే, 4 రోజులు సెలవులు ఉండేవి.
ఇవ్వాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 26 రోజులు కంటిన్యూ డ్యూటీ చేస్తే, 4 రోజులు లీవ్ ఇస్తామని అంటున్నారని ఆర్ఎస్పీ తెలిపారు. ఇక రాష్ట్రంలో రోజురోజుకు శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి హోం మంత్రి లేడు.. సీఎం రేవంత్
రెడ్డి వద్దనే హోం శాఖ ఉంది. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏక్ పోలీసు నినాదం అన్నారు. మరి ఏక్ పోలీసు నినాదం ఏమైంది రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
హైదరాబాద్ వ్యాప్తంగా నేరాలు పెరిగిపోతున్నాయి. అంబర్పేటలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ లింగారెడ్డి దంపతులను దారుణంగా హత్య చేశారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తపై గొడ్డలితో దాడి చేశారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టిన సీసీ కెమెరాలు ఇప్పటి వరకు పని చేయడం లేదని ఆర్ఎస్పీ తెలిపారు.
కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్లపై ఎన్ని కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజు డీజీపీ నాకు ఆహ్వానం పంపారు. నేను బయటకు వెళ్తానంటే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసు శాఖలో అశాంతి నెలకొంది. మైనంపలి హన్మంతరావు గజ్వేల్లో కేటీఆర్, హరీష్ రావుపై పెట్రోల్ పోసి చంపుతాను అంటే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే ఇప్పటి వరకు నింధితులను అరెస్టు చేయలేదు. జూపల్లి కృష్ణారావు హస్తం ఉందని శ్రీధర్ రెడ్డి తండ్రి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. శ్రీధర్ రెడ్డి హత్యలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాత్రపై విచారణ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.