పోలీసు కుటుంబాలు రోడ్డెక్కడం చరిత్రలోనే మొదటిసారి.. రేవంత్ సర్కార్పై మండిపడ్డ ఎమ్మెల్యే సబిత
హైదరాబాద్ అక్టోబర్ 26 (ప్రజాక్షేత్రం):ఏక్ పోలీసు విధానం అమలు చేయాలని కోరుతూ.. పోలీసు కుటుంబాలు రోడ్డెక్కడం చరిత్రలోనే ఇది మొదటిసారి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కానిస్టేబుళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ రెడ్డినే కారణమని ఆమె మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ ఫెయిల్ అవ్వటం వల్లే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయన్నారు. రక్షక భటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరమన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి..? అని నిలదీశారు. రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవటం వలన.. కానిస్టేబుల్స్ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. యూనిఫాం వేసుకుని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చిందన్నారు. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం దారుణమని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్ మాటను నిలబెట్టుకోవాలని సబిత డిమాండ్ చేశారు. 15 రోజులకు 4 రోజులు కుటుంబంతో గడిపే పాత పద్ధతిని కొనసాగించాలి. పిల్లలు కూడా తండ్రులను గుర్తుపట్టని పరిస్థితులు పోలీస్ కుటుంబాలవి అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయి. డీజీపీ స్థాయి అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.