డిజిటల్ అరెస్టులపై అవగాహన అవసరం.. ‘మన్ కీ బాత్’లో మోదీ
న్యూఢిల్లీ అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం): డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఏ దర్యాప్తు సంస్థ కూడా ఫోన్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ విచారణ చేపట్టదని స్పష్టం చేశారు. దీన్ని గమనించి పోలీసులు, ఏజెన్సీల పేరుతో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. ‘మన్ కీ బాత్’ 115వ ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ఆదివారంనాడు ప్రసంగించారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
”డిజిటల్ అరెస్టు మోసాల కింద కాలర్లు తమను తాము పోలీసులుగా, సీబీఐ, ఆర్బీఐ, నార్కోటిక్స్ అధికారులుగా పరిచయం చేసుకుంటారు. చాలా నమ్మకంగా మాట్లాడతారు. ఈ విషయాన్ని ‘మన్ కీ బాత్’లో మాట్లాడమని ప్రజలు నన్ను కోరారు. దీనిపై మీరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి స్టెప్ మీ వ్యక్తిగత సమాచారం. కాలర్లు మొదట మీ సమాచారాన్ని రాబడతారు. భయం కలిగించడం రెండో స్టెప్. ఆలోచించే వ్యవధి కూడా ఇవ్వనంతగా భయపెడతారు. ఫలానా సమయం లోగా అంటూ ఒత్తిడి చేయడం మూడో స్టెప్. డిజిటల్ అరెస్టు బాధితుల్లో అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు ఉన్నారు. కష్టపడి సంపాదించుకున్న లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. మీకు గనుక ఇలాంటి కాల్ ఏదైనా వస్తే అస్సలు భయపడవద్దు. ఏ దర్యాప్తు సంస్థ కానీ ఇలాటి ఫోన్, వీడియో కాల్స్ చేయదు” అని మోదీ తెలిపారు.
రికార్డు చేయండి
డిజిటల్ సెక్యూరిటీ కోసం 3 జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని తెలిపారు. ”ఆగండి, ఆలోచించండి, చర్య తీసుకోండి” అనేవి మూడు స్టెప్స్ అని చెప్పారు. వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, కాలర్ మాటలు రికార్డు చేయండి. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్లలో బెదిరించడం కానీ, డబ్బులు డిమాండ్ చేయడం కానీ ఉండదు.. అని ప్రధాని తెలిపారు. డిజటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా భయపెడితే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫోన్ చేయాలని, సైబర్ క్రైమ్లో పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డిజిటల్ అరెస్టు అనేది చట్టంలో లేదని, ఇదొక మోసమని, నేరస్తులు చేసే పని అని ప్రధాని వివరించారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు అన్ని దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తు సంస్థలు వేలాది వీడియో కాలింగ్ ఐడీలను, లక్షల్లో సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేసినట్టు చెప్పారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసినప్పిటకీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ వివరించారు.