Praja Kshetram
తెలంగాణ

జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్ పాకాల సేట్మెంట్ రికార్డ్..

జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్ పాకాల సేట్మెంట్ రికార్డ్..

 

హైదరాబాద్ అక్టోబర్ 30 (ప్రజాక్షేత్రం):జన్వాడ ఫామ్ హౌస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల విచారణ ముగిసింది. రాజ్ పాకాలను మోకిల పోలీసులు దాదాపు 8గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు బుధవారం నాడు అతడిని విచారించారు. విచారణ మధ్యలో రాజ్ పాకాలను పార్టీ జరిగిన జన్వాడ ఫామ్ హౌస్‌కు పోలీసులు తీసుకెళ్లారు. సుమారు గంట పాటు ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహించారు. పార్టీలో డ్రగ్స్ వినియోగించి దొరికిపోయిన విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగింది. ముఖ్యంగా విజయ్ మద్దూరి ఫోన్ చుట్టూ విచారణ కొనసాగింది. గతంలో జరిగిన పార్టీలు, విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజీటివ్ రావడం సహా పలు అంశాలపై ఆరా తీశారు. ఈ మేరకు రాజ్ పాకాల స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేశారు. అతని మొబైల్ ఫోన్‌ను మోకిలా పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం విచారణ పూర్తయిందని, అవసరం అయితే మరోసారి అతన్ని పిలుస్తామని నార్సింగి ఏసీపీ తెలిపారు. అయితే విచారణ అనంతరం మోకిల పోలీస్ స్టేషన్ నుంచి రాజ్ పాకాల బయటకు వచ్చారు. తాను పోలీసులకు పూర్తిగా సహకరించానని ఆయన మీడియాకు తెలిపారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకూ తాను సమాధానం చెప్పినట్లు వెల్లడించారు. జన్వాడ ఫామ్ హౌస్‌లో జరిగింది ఫ్యామిలీ పార్టీ అని, విజయ్ మద్దూరి పోలీసులకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని ఆయన మీడియాకు తెలిపారు. ఎవరికో పాజిటివ్ వస్తే తనకు సంబంధమేంటని రాజ్ పాకాల ప్రశ్నించారు. ఈ ఘటనతో తమ ఫ్యామిలీ మెుత్తం డిస్టర్బ్ అయ్యిందని, ఫ్యామిలీ పార్టీలు చేసుకోకూడదా? అంటూ ప్రశ్నించారు. కావాలనే ఈ విషయాన్ని పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని రాజ్ పాకాల అన్నారు.

Related posts