Praja Kshetram
తెలంగాణ

లగచర్ల ఘటనపై హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌

లగచర్ల ఘటనపై హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌

 

హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై దాడి ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు వినిపిస్తుండగా.. తమపై కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డి ఉన్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. రీమాండ్‌ను కొట్టివేయాలని నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

అసలేం జరిగింది..

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం.. లగచర్ల, పోలేపల్లిలో 1350 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తొలుత ఫార్మా విలేజ్ ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం భావించింది. దీనికి ఆయా గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ క్రమంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అందులోభాగంగా ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం దుద్యాలలో అధికారులు గ్రామ సభ, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

కలెక్టర్‌పై దాడి..

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలతోపాటు పలువురిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్‌పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేశ్ అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దాడి జరిగే సమయానికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో పదుల సంఖ్యలో ఫోన్ కాల్ చేసి సురేశ్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి సైతం.. ఓ వైపు సురేశ్‌తో మాట్లాడుతూనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు డీజీపీ ఇప్పటికే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న సురేశ్‌పై ఇప్పటికే అత్యాచారం కేసుతో సహా వివిధ కేసులు సైతం నమోదయ్యాయి. అయితే గతంలో సురేష్‌పై నమోదయిన కేసులను తొలగించేందుకు పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది.

Related posts