Praja Kshetram
తెలంగాణ

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం : ఎప్పట్నుంచంటే?

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం : ఎప్పట్నుంచంటే?

 

కామారెడ్డి డిసెంబర్ 13(ప్రజాక్షేత్రం):అతి త్వరలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సుకు ఇప్పటి వరకు రూ.4 వేల కోట్లు అయ్యిందని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చామని, త్వరలో ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని తెలిపారు. జర్నలిస్టులకు తమ మద్దతు ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్‌లు కూలిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… దేశ చరిత్రలోనే వందేళ్ల చరిత్ర గల ప్రాజెక్ట్ నిజాంసాగర్ ప్రాజెక్టు అని చెప్పారు.గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.81 లక్షల కోట్ల అప్పు చేసి ఇరిగేషన్ మీద ఖర్చు చేసిందని అన్నారు. పాలమూరు, సీతారాం ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల నుంచి ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం తాము రూ.22500 కోట్లను ఇరిగేషన్ మీద ఖర్చు పెడుతున్నామన్నారు. జాతీయ నీటి సంఘం ఇచ్చిన ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న మూడు బ్యారేజ్‌లలో నీళ్లను తాము వినియోగించలేమని చెప్పారు. కాళేశ్వరం నీటిని సముద్రంలో వదిలేశామని అన్నారు. కాళేశ్వరం నీళ్లను వాడకుండా ఈ ఏడాది అత్యధికంగా దేశంలోనే వరి దిగుబడిని సాధించామన్నారు. రికార్డు స్థాయిలో పండించిన పంటలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొన్నామని గుర్తుచేశారు. ఈ ఐదేళ్ల పాటు రైతులు పండించిన సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. తమ కేబినెట్ మంత్రులం అంతా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తున్నామని అన్నారు. పొదుపుతో నీటిని వాడుకోండి, ఆన్ ఆఫ్ మోడ్‌లో సాగు నీళ్లను అందిస్తామన్నారు. నాగ మడుగు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని మాటిచ్చారు. లెండి ప్రాజెక్ట్ పూర్తి అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

Related posts