డా. బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు అందుకున్న శంకర్పల్లి మండల వాసి
శంకర్ పల్లి డిసెంబర్ 16 (ప్రజాక్షేత్రం):డా బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు 2024 సంవత్సరమునకు గాను శంకర్ పల్లి మండల మాసానిగూడ గ్రామానికి చెందిన మాల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మన్నెగూడెం వేణుగోపాల్ ఎంపిక అయ్యారు. ఈ అవార్డు న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా బహుజన రైటర్స్ 17 వ నేషనల్ కాన్ఫరెన్స్ లో భాగంగా బహుజన సాహిత్య అకాడమీ (బిఎస్ఏ) జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్, అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ చొక్కంపేట ఆంజనేయులు చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి యేటా ప్రజా సామాజిక ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, కవులకు, రచయితలకు, స్వచ్చంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలియజేసారు. ఈ సదస్సుకి దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారుగా 500 మంది డెలిగేట్స్ హాజరైనట్లు తెలిపారు. అనంతరం మన్నెగూడెం వేణుగోపాల్ మాట్లాడుతూ తమను గుర్తించిన బిఎస్ఏ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు రావడంతో తనపై మరింత భాధ్యత పెరిగిందని, అంతే కాకుండా భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో ప్రజా ఉద్యమాలలో పోరాటం చేస్తామని తెలియజేసారు. కార్యక్రమంలో బిఎస్ఏ కార్యదర్శి విష్ణు వర్ధన్, బహుజన సాహిత్య అకాడమీ సభ్యులు పాల్గొన్నారు.