సవాళ్ల సవారీ.. బయటకొచ్చేనా గులాబీ అధిపతి..!
-నిన్నటిదాకా కూతురి కేసుతో సతమతం
-నేడు ఈ – రేస్లో కొడుకుతో అయోమయం
-అటు విద్యుత్, కాళేశ్వరం కమిషన్లతో గుబులు
-ఇటు కాక రేపుతున్న పొలిటికల్ సెగలు
-ఫాంహౌజ్ను దాటి కేసీఆర్ బయటకొస్తారా?
-పార్టీని నడిపించే బాధ్యత చేపడతారా?
-లీడర్లకు, కేడర్కు భరోసా కల్పిస్తారా?
-స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటి?
హైదరాబాద్ డిసెంబర్ 22(ప్రజాక్షేత్రం):అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుస ఇబ్బందులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సవాళ్లతో సవారీ అనివార్యంగా మారింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కూతురు కవిత బెయిల్పై వచ్చిందన్న సంతోషం ఎంతోసేపు నిలవకముందే ఫార్ములా ఈ – రేస్ కేసులో కొడుకు కేటీఆర్కు చిక్కులు మొదలు కావడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి పది రోజుల రిలీఫ్ లభించినా ఈడీ ఎంటర్ కావడంతో ఏ రోజు ఏమవుతుందో తెలియని అయోమయం ఆ కుటుంబాన్ని, పార్టీ లీడర్లను వెంటాడుతున్నది. ప్రజా సమస్యలను టేకప్ చేసి క్షేత్రస్థాయిలో యాక్టివ్ అవుతున్న సమయంలోనే కేటీఆర్ను కేసులు నమోదు కావడంతో కేడర్ డీమోరల్ కాకుండా చూసుకోవడం కేసీఆర్కు ఇప్పుడు పెద్ద సవాల్. ఏడాదికి పైగా ఫాంహౌజ్కే పరిమితమైన ఆయన, తాజా పరిణామాల నేపథ్యంలో బయటకొస్తారా? పార్టీ యాక్టివిటీస్పై దృష్టి పెడతారా? లీడర్లకు, కేడర్కు దిశానిర్దేశం చేస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీస స్థాయిలోనైనా సీట్లను గెల్చుకుని పార్టీని గౌరవప్రదమైన స్థానంలో ఉండేలా చూస్తారా? లేదంటే హరీశ్ రావు, కవితకు బాధ్యతలు అప్పజెప్పి మరికొంతకాలం రిలాక్స్ మూడ్లోనే ఉంటారా? ఇలా అనేక రకాల చర్చలు మొదలయ్యాయి. మరోవైపు విద్యుత్ కమిషన్ రిపోర్టుపై రాష్ట్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయంతో కేసీఆర్ పట్ల ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది కూడా పార్టీ కేడర్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నది.
*ఈడీ అరెస్ట్ చేస్తే?*
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తుంటి ఎముక గాయంతో కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్, రెస్టుకు కేసీఆర్ పరిమితమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సమయంలో కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి 5 నెలలకు పైగా తీహార్ జైల్లో ఉండడంతో దానిమీద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ గెల్చుకోలేకపోవడంతో పార్టీ కేడర్ నిరుత్సాహానికి గురైంది. కవిత బెయిల్పై విడుదలైన తర్వాత ఆ కుటుంబంలో సంతోషం నెలకొన్నా ఇప్పుడు ఏసీబీ, ఈడీ కేసుల్లో కొడుకు కేటీఆర్ చిక్కుకోవడంతో కేసీఆర్ పాత్ర పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ను అరెస్టు చేయడంపై ఆ పార్టీ నేతల్లో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. కేసును ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణ చేస్తున్నందున మొత్తానికే ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి పూర్తి రిలీఫ్ లభిస్తుందని పార్టీ లీడర్లు భావించారు. కానీ, హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేసి ఏసీబీ అరెస్టు చేయకుండా ఉపశమనం కల్పించింది. కానీ, ఈడీ అరెస్టు చేస్తే, అనే ఆందోళన మాత్రం లీడర్లు, కేడర్లో కంటిన్యూ అవుతున్నది.
*కేసీఆర్ బయటకొస్తారా?*
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ అరెస్టయితే ప్రెసిడెంట్గా కేసీఆర్ యాక్టివ్ రోల్ పోషిస్తారా? లేక హరీశ్ రావు, కవితను రంగంలోకి దించుతారా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే కవితపై ఢిల్లీ లిక్కర్ కేసు ముద్ర ఉండడంతో ఆమెను తప్పించి హరీశ్ రావుకు బాధ్యతలు అప్పజెప్తారా? అదే జరిగితే పార్టీలో ఆయన మరింత బలపడతారా? ఇలాంటి పరిణామం జరగకుండా నేరుగా ఆయనే లీడ్ రోల్ తీసుకుంటారా? లాంటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నా అధినేత నుంచి క్లారిటీ లేకపోవడంతో రాష్ట్ర స్థాయి లీడర్లలో డైలమా నెలకొన్నది. ఒకవైపు చత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని పవర్ ఎంక్వయిరీ కమిషన్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని మంత్రివర్గం చర్చించి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆందోళన కొనసాగుతున్నది. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కరొక్కరుగా కేసుల్లో చిక్కుకోవడంతో పార్టీని నడిపించే అంశం చర్చనీయాంశంగా మారింది.
*ముంచుకొస్తున్న స్థానిక ఎన్నికలు*
ఇంకోవైపు జనవరి చివరిలో లేదా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించే నాటికి బీఆర్ఎస్ నేతలపై చర్యలు ఎలాంటి రూపం తీసుకుంటాయన్నది కూడా గులాబీ పార్టీలో గుసగుసల స్థాయిలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ ప్రతిష్ట మసకబారడంతో కనీసం స్థానిక ఎన్నికల్లో కొన్ని పదవులైనా దక్కించుకుని గౌరవాన్ని నిలబెట్టుకుని పార్టీ ఉనికిని కాపాడుకోవాలన్నది నాయకత్వం ఉద్దేశం. కానీ, కవితపై ఉన్న ఢిల్లీ లిక్కర్ కేసు ముద్ర, కేటీఆర్పై ఈ – రేస్ కేసు, కేసీఆర్పై విద్యుత్ కమిషన్ రిపోర్టు తదనంతరం చర్యలు, హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగిస్తే హీరోగా మారుతారనే అనుమానం. ఇవన్నీ కేసీఆర్ను మానసికంగా టెన్షన్లో పడేస్తున్నాయి. మౌనాన్ని వీడి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు లీడర్లకు, కేడర్కు ఆసక్తికరంగా మారింది. కీలకమైన ఈ క్లిష్ట సమయంలో వలసలను కాంగ్రెస్ మరింతగా వేగవంతం చేస్తే నిరుత్సాహంలో ఉన్న ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడం కూడా కీలకంగా మారనున్నది. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. రానున్న రోజుల్లో ఇంకెంతమంది ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని అయోమయం బీఆర్ఎస్లో నెలకొన్నది. కీలక నేతలే టచ్లో ఉన్నారంటూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఏడాది కాలంగా పెదవి విప్పకుండా సైలెంట్గా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకం. కేటీఆర్ అరెస్ట్ జరిగితే ఆ షాక్ నుంచి లీడర్లను, కేడర్ను సేవ్ చేసుకోవడం అన్నింటికంటే ప్రధానం