సినిమా దర్శకులతో మంద కృష్ణ మాదిగ భేటీ
హైదరాబాద్ జనవరి 03(ప్రజాక్షేత్రం):తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకులైన ఎన్. శంకర్, వేణు ఉడుగుల, ప్రేమ్ రాజు ఇనుముల, కుమారస్వామి వారితో ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకొచ్చుకోవడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతి పెద్ద సాంస్కృతిక పోరాటమైన ” వేల గొంతులు – లక్షల డప్పులు ” కార్యక్రమంలో భాగస్వాములు కావాలని , ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రాచుర్యం పొందడానికి కావలసిన సహాయ సహకారాలు అందించాలని దర్శకులను మంద కృష్ణ మాదిగ కోరారు. దీనిపై దర్శకులు స్పందిస్తూ ముప్పై ఏళ్లుగా ఒక లక్ష్యం కోసం నిలబడి రాజీలేకుండ మంద కృష్ణ మాదిగ పోరాటం చేయడం అనేది మామూలు విషయం కాదని, ఈ పోరాటంలో న్యాయం ధర్మం ఉంది కనుకనే ఇక్కడిదాకా రాగలిగారని, అందరికి న్యాయం జరగలనే లక్ష్యంతో జరుగుతున్న వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అన్ని విధాలుగా ఉద్యమానికి తోడుగా ఉంటామని తెలిపారు. ఈ అంశాలతో పాటు అణగారిన వర్గాల ఆకాంక్షలు, సినిమా ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు మొదలగు విషయాలు కూడా చర్చించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దూమ్ దామ్ కన్వీనర్ అంతడుపుల నాగరాజు, ప్రజా వాగ్గేయకారులు దరువు ఎల్లన్న, గేయ రచయిత పాటమ్మ రాంబాబు, ఓయు ఉద్యమ నేత నలిగంటి శరత్, డిజిటల్ మీడియా స్టేట్ ఇంచార్జి సోమారపు మురళీకృష్ణ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.