Praja Kshetram
తెలంగాణ

మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి

మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి

-జిల్లాలో చెలరేగుతున్న మైనింగ్ మాఫియా

-తాటిపాములలో అనుమతులు లేకుండా ఎదేచ్చగా బ్లాస్టింగ్

-బ్లాస్టింగ్ ధాటికి ఇండ్లకు బీటలు

-పిల్లలు, గర్భిణీలు, వృద్ధుల ప్రాణాలకు ముప్పు

-ప్రజల జీవితాలకు మరియు ఆస్తులకు రక్షణ కల్పించాలి

-బిసి పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి జనవరి 16(ప్రజాక్షేత్రం):అక్రమ మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని బిసి పొలిటికల్ జెఎసి రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామంలో అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్న ప్రాంతాన్ని, బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇండ్లను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ బి ఆర్ క్రషర్ యజమానులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎదేచ్చగా బ్లాస్టింగ్ చేస్తున్నా కూడా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ అక్రమ మైనింగ్ వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో సంవత్సరాలుగా అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారని, దీంతో ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామంలోని ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో జీవిస్తున్నారని అన్నారు. బ్లాస్టింగ్ శబ్దానికి పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్న వారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అక్రమ మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలు స్థానిక పర్యావరణ వ్యవస్థకు కోలుకోలేని నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్నారు. అనుమతుల గురించి జిల్లా మైనింగ్ అధికారి, స్థానిక తహసీల్దార్, ఎస్సై లకు ఫోన్ చేసి అడగగా బ్లాస్టింగ్ చేయడానికి తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారని అన్నారు. సరైన అనుమతులు లేకుండా, భద్రతా చర్యలు లేకుండా నిర్వహిస్తున్న అనధికార బ్లాస్టింగ్ కార్యకలాపాలను నిలిపివేసి, తాటిపాముల గ్రామంలోని నివాసితుల జీవితాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జెఎసి జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, నాయకులు మహేందర్ నాయుడు, రాఘవేందర్ గౌడ్, దేవర శివ, జితేందర్, మాజీ సర్పంచ్ బజారయ్య, నాగరాజు యాదవ్, వెంకటయ్య, పోషన్న, సుబద్రమ్మ, వెంకటమ్మ, సుశీలమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts