నిర్లక్ష్యానికి నిలువుటద్దం!
జగిత్యాల దవాఖాన
- రోగులను పట్టించుకోని సిబ్బంది
- బెడ్ మీద నుంచి కిందపడ్డ వృద్ధుడు
జగిత్యాల, జనవరి 21(ప్రజాక్షేత్రం): ‘నేను రాను బిడ్డో, సర్కారు దవాఖానకు..’ అన్న సినిమా పాటను అక్షరాలా నిజం చేసి న ఘటన ఇది. నిరంతరం రోగులకు సేవలందించి, ఆదుకునే పవిత్ర దేవాలయం లాంటి వైద్యశాలలో చోటు చేసుకున్న అమానవీయ సంఘటన ఇది. జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు సేవలందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. 24 గంటలు రోగుల సేవలో తరించాల్సిన సిబ్బంది వారిని పట్టించుకోవడం లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొల్లపల్లి మండల మల్లన్నపేటకు చెందిన భూమయ్య అనే వృద్ధుడు ఆదివారం అర్ధరాత్రి బెడ్ పైనుంచి కింద పడిపోయాడు.‘చచ్చి పోతున్నా.. కాపాడండి బాబూ’ అంటూ అరిచినా డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. గమనించిన ఇతర పేషెంట్లు మీడియాకు సమాచారం అందించారు. మీడియా ప్రతినిధులు కొందరు ఆసుపత్రికి చేరుకోవడంతో డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందిలో చలనం వచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా భూమయ్య వద్దకు వెళ్లి అవసరమైన సేవలందించారు. కొద్ది నెలల క్రితం గొల్లపల్లి మండలానికి చెందిన వృద్ధ దంపతుల విషయంలోనూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు తెలిసిందే. అనారోగ్యంతో ఉన్న ఆ దంపతులు ఆసుపత్రికి వెళ్తే, వృద్ధుడికి చికిత్స చేస్తు క్రమంలో వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోగా, ఆమెను ఆసుపత్రి బయటకు తీసుకొచ్చి రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయారు. ఆమె భర్త కూడా భార్య కోసం వెతుక్కుంటూ వచ్చి ఆమె పక్క కూర్చున్నాడు. పోలీసులు రంగంలోకి దిగి వృద్ధ దంపతులను ఆసుపత్రి కి తరలించారు. మరో ఘటనలో డ్యూటీ సమయంలోనే ఆసుపత్రి లో నర్సులంతా ఒక గదిలో డ్యాన్స్ ప్రాక్టీ చేశారు. ఇది గమనించిన రోగుల బంధువులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తరచూ ఏదో ఒక ఘటనతో జగిత్యాల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడుతూనే ఉంది. ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు మాత్రం తీసుకోవడంలేదు.