గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ, జనవరి 25(ప్రజాక్షేత్రం): గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ప్రసంగించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైందని, భారత రాజ్యాంగం అమలుల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశం మొత్తం గర్వించదగిన సందర్భం ఇది అని, అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగిందన్నారు. భారతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని, వెలుగులోకి రాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలని చెప్పారు. ఈ ఏడాది బిర్సా మొండా 150వ జయంతి వేడుకలను జరుపుకున్నామని, మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను మార్చుకున్నామని రాష్ట్రపతి గుర్తు చేశారు. ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఎల్లప్పుడూ మన నాగరిక వారసత్వంలో భాగంగా ఉన్నాయని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళా మన వారసత్వ గొప్పతనానికి నిదర్శనంగా చూపిస్తుందన్నారు. జమిలి ఎన్నికల పాలనలో స్థిరత్వాన్ని అందిస్తాయని, ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని వెల్లడించారు.