Praja Kshetram
ఆరోగ్యం

బీపీ అదుపులో ఉండాలంటే ఈ ఆయుర్వేద సూచనలు ఫాలో కావాలి

బీపీ అదుపులో ఉండాలంటే ఈ ఆయుర్వేద సూచనలు ఫాలో కావాలి

 

బీపీని అదుపులో ఉంచేందుకు ఆధునిక ఔషధాలతో పాటు ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్(ప్రజాక్షేత్రం):రక్తపోటు అంటేనే సైలెంట్ కిల్లర్. దీన్ని నియంత్రించేందుకు ఆధునిక వైద్య శాస్త్రం ఎన్నో ఔషధాలు అందించింది. అయితే, బీపీని సహజసిద్ధంగా నియంత్రణలో ఉంచుకునేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలు వేసిన గోరు వెచ్చని నీరు తాగితే బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇందులోని అలిసిన్ అనే కాంపౌండ్.. రక్త నాళాలు రిలాక్సయ్యేలా చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఇక రాత్రంతా నీళ్లల్లో నానబెట్టిన ఎండుద్రాక్షలు ఏడెనిమిది తింటే బీపీ అదుపులో ఉంటుంది. వీటిల్లోని అధిక పొటాషియం.. రక్తంలోని సోడియం స్థాయిలు తగ్గేలా చేసి బీపీని అదుపులో ఉంచుతాయి. గోరువెచ్చని నూనెతో ఒంటికి మసాజ్ చేస్తే నాడీ వ్యవస్థ రిలాక్సయ్యి బీపీపై అదుపు వస్తుంది. స్నానానికి ముందు 20 నుంచి 30 నిమిషాలు ఇలా మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. తులసి నీరు, నిమ్మరసం తాగితే కూడా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. తులసిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఒత్తిడి తగ్గించే గుణాలు బీపీని అదుపులో ఉంచుతాయి. నిమ్మరసం కారణంగా శరీరంలో అధికంగా ఉన్న సోడియం బయటకుపోయి బీపీ అదుపులోకి వస్తుంది. ఆరోగ్యకరమైన జీవన శైలి కూడా బీపీ అదుపు తప్పకుండా చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇందు కోసం ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలలోపే లేవాలి. రాత్రి పదిలోపే నిద్రకు ఉపక్రమించాలి. ప్రతి రోజూ ఒకే సమయంలో ఆహారం తినాలి. రాత్రి సమయాల్లో మొబైల్ ఫోన్ చూడటం లేదా కడుపు నిండుగా తిని పడుకోవడం మానుకోవాలి. ఈ నియమాలతో బీపీకి సులువుగా చెక్ పెట్టొచ్చు. బీపీని నియంత్రించేందుకు ప్రాణాయామం కూడా కీలకం. శీతలి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం టెక్నిక్స్‌తో బీపీపై నియంత్రణ పెరుగుతుంది. శీతలి ప్రాణాయామంతో నాడీ వ్యవస్థ రిలాక్స్ అయ్యి బీపీ వెంటనే నియంత్రణలోకి వస్తుంది. ఇక అనులోమ విలోమ ప్రాణాయామంతో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. ఒత్తిడి కారణంగా వచ్చే బీపీపై అదుపు పెరుగుతుంది.

 

 

Related posts