Praja Kshetram
తెలంగాణ

ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు తగిన వాటాను ఇవ్వాలి:మందకృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు తగిన వాటాను ఇవ్వాలి:మందకృష్ణ మాదిగ

 

తిరుమలగిరి ఫిబ్రవరి 24(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షమీం అత్తర్ నివేదిక ప్రకారం ఆమోదించిన ఎస్సీ వర్గీకరణలో శాస్త్రీయత, హేతుబద్ధత పూర్తిగా లోపించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. అందువల్లనే అన్నికులాల్లో అసంతృప్తి నెలకొంది కనుక అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సోమవారం సికింద్రాబాద్ డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను మాలలు మినహా ఎస్సీలలో మిగతా 58 కులాలు కోరుతున్నాయని అన్నారు. లక్షల డప్పుల ఉద్యమ ప్రభావంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఆగమేఘాల మీద శాసనసభలో ఆమోదించిందని అన్నారు. అయితే జస్టీస్ షమీమ్ అక్తర్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఏ మాత్రం శాస్త్రీయత, హేతుబద్ధత పాటించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికను పూర్తిగా అధ్యయనం చేయకుండానే ఆమోదించిందని అన్నారు. మాదిగల జనాభాను పరిగణనలోకి తీసుకున్నా లేదా వెనుకబాటుతనం ఆధారంగా తీసుకున్నా 12శాతం రిజర్వేషన్లు రావాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం 3గ్రూప్ లు చేస్తే ఒక గ్రూప్ లో వెనుకబాటుతనం మరొక గ్రూప్ లో జనాభా మరొక గ్రూప్ లో ఏ ఆధారం లేకుండానే రిజర్వేషన్లు కేటాయించి అశాస్తీయంగా వర్గీకరణ చేశారని, ఈ తప్పులను లోపాలను సవరించి, అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చూడాలని అన్నారు. ముఖ్యమంత్రి మా విజ్ఞప్తి మేరకు కమిషన్ గడువు పొడగించారని, అదే స్ఫూర్తితో అన్ని కులాల ఆకాంక్షల్ని పరిగణలోకి తీసుకుని న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని కేవలం మాదిగల కోసం మాత్రమే నడుపలేదని అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలు లభించేలా చేయడమే మా లక్ష్యమని అన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం మొదటి నుండి సామాజిక న్యాయానికి, సమానత్వానికి కట్టుబడి ఉందని దాని ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఎస్సీ వర్గీకరణ ఎబిసిడి అనే నాలుగు గ్రూప్ లుగా చేయాలని ప్రస్తుతం గ్రూప్ 3లో నేతకాని, మహర్, మాల దాసరి, హోలీయ దాసరి, మిత్ అయ్యలవార్ మొదలగు కులాలను కొనసాగించి మాలలను గ్రూప్4 లో చేర్చాలని అన్నారు. గ్రూప్1లో నుండి అభివృద్ధి చెందిన కులాలైన మన్నె, పంబాలా కులాలను తొలగించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల కేటాయింపులు, కులాల కూర్పు నిర్దిష్టంగా హేతుబద్ధంగా చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చేసేంత వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలని,ప్రజల్లోకి అన్ని విషయాలను వివరంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మనకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం మరో పోరాటాన్ని సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అధ్యక్షత వహించగా మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత, బీసీ నేత డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్, సయ్యద్ ఇస్మాయిల్, హోలియ దాసరి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్, సీనియర్ నాయకులు జానకి రామయ్య, వేల్పుల సూరన్న, ఇంజం వెంకటస్వామి, రాగటి సత్యం, బొర్ర బిక్షపతి మాదిగ, ఇటిక శ్రీ కృష్ణ మాదిగ, కళా నేతలు మిట్టపల్లి సురేందర్, మచ్చ దేవేందర్, రామంచ భరత్, హైదరాబాద్ జిల్లా నేతలు టీవి నరసింహా, డప్పు మల్లికార్జున్ మాదిగ, అజిత్ కళ్యాణ్ వాల్మీకి, విఎస్ రాజు, వెలుపల విష్ణు మాదిగ, మునిరతి అరుణ్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ జాతీయ అధ్యక్షులు సోమ శేఖర్ మాదిగ, కొమ్ము శేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Related posts