కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..
హైదరాబాద్, మార్చి 04 (ప్రజాక్షేత్రం):రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది నాటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఆ క్రమంలో కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఫైనల్ చేశారు. లేత నీలి రంగులో ఈ కొత్త రేషన్ కార్డును తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డితోపాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉండే విధంగా రేషన్ కార్డు నమూనాని ఖారారు చేశారు. ఇక రేషన్ కార్డుపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రభుత్వం ఆదేశించారు. ఇంకోవైపు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఇప్పటికే ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మీ సేవలను క్యూ కట్టారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి రేషన్ కార్డు తప్పని సరి కావడంతో.. వీటి కోసం దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య పెరుగుతోంది. అదీకాక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది. ఆ సర్వేలో సైతం కుటుంబ సభ్యుల ఆదాయం, ఇతర వనరులకు సంబంధించి కీలక సమాచారాన్ని నమోదు చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రజల ఆదాయంపై ప్రభుత్వానికి ఓ నిర్దిష్టమైన సమాచారం ఉంది. దాంతో దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే రేషన్ కార్డు అందించేలా రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 30వ తేదీ తెలుగు సంవత్సరాది.. ఉగాది. ఆ రోజున కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సీఎం రేవంత్ రెడ్డి తన స్వహస్తాలతో శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలనే ఓ స్పష్టమైన లక్ష్యంతో రేవంత్ సర్కార్ వడి వడిగా అడుగులు వేస్తోంది.