ఆశావర్కర్పై లైంగికదాడి పాల్పడిన నిందితుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
– సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్ మార్చి 06(ప్రజాక్షేత్రం):జగిత్యాల జిల్లా రాయికల్లో దళిత మహిళ అయిన ఆశావర్కర్ డ్యూటీ పూర్తిచేసుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా, ఒక కామాందుడు దౌర్జన్యం చేసి, బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన జరిగి వారం రోజులవుతున్నా, నిందితున్ని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. తక్షణమే నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇవి పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, మహిళల రక్షణకోసం తగిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో బాధితురాలికి సరైన వైద్యం అందించలేదు. పోలీస్ యంత్రాంగం నిందితునికి అండగా ఉండి, బాధితురాలికి అన్యాయం చేసే వైఖరి అవలంభిస్తున్నట్టు కనపడుతుంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలి. బాధితురాలికి సరైన వైద్యం అందించాలని, ఇంటి స్ధలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం, ఇతర ఆర్ధిక సహాయ సహకారాలు అందించాలని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ డిమాండ్ చేస్తున్నది.