గతంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చట్టం తేవాలి.
– ఉద్యోగ నియామకాల్లో మాదిగలకు ద్రోహం.
– కాంగ్రెస్ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు.
– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.
కవాడిగూడ, మార్చి 10(ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకూ ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. గతంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చట్టానికి రూపకల్పన చేయాలని అన్నారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద సోమవారం జరిగిన రిలే నిరాహార దీక్షలకు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని గతంలో ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ చట్టం (రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఆక్ట్ 2000) రూపొందించారని తెలిపారు. ఆ చట్టంలో గతంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్కు వర్గీకరణ సూత్రం వర్తింపజేసేలా 4వ నిబంధనను పొందుపరిచారని చెప్పారు. ఆ చట్టాన్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించాలని సూచించారు. గతంలో ఇచ్చిన నోటిషికేషన్లో వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టడం సాధ్యం కాదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు చూపెట్టిన నిజాయితీని రేవంత్రెడ్డి చూపెడితే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్లో వర్గీకరణ అమలు జరుగుతుందని అన్నారు. వర్గీకరణ వ్యతిరేక తీర్పును వేగంగా అమలు చేశారని, వర్గీకరణ అమలు తీర్పును అమలు చేయడానికి కొర్రీలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్సే అధికారంలో ఉందని గుర్తుచేశారు. ఎస్సీ ఉద్యోగాలను మాలలకు దోచిపెట్టడమే కాంగ్రెస్ విధానమని మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఓ వైపు ఎస్సీ వర్గీకరణ చట్టం వస్తుందని చెబుతూనే.. మరోవైపు చట్టం రాకముందే ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం మాదిగలకు ద్రోహం చేయడమేనని అన్నారు. గ్రూప్ 1, 2, 3, డబ్ల్యూహెచ్వో, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తదితర అన్ని ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మాలల కోసం మాదిగలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం మాదిగలకు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు దీక్షలు కొనసాగుతున్నాయని తర్వాత శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని అన్నారు. తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల ముట్టడిలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వి రాజ్, తెలంగాణ విఠల్, సయ్యద్ ఇస్మాయిల్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.