స్కూల్లో గుంజీలు తీసిన హెడ్మాస్టర్..
అమరావతి మార్చి 13(ప్రజాక్షేత్రం): పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని స్కూల్ హెడ్మాస్టర్ గుంజీళ్లు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. పిల్లలు చదువులో వెనకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మండలం, పెంట జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రమణ వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీశారు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. హెడ్మాస్టర్ గారూ! అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం..అంటూ మంత్రి నారా లోకేష్ సూచించారు.