కన్న బిడ్డల ప్రాణం తీసిన కసాయి తండ్రి
కాకినాడ మార్చి 15(ప్రజాక్షేత్రం):కన్నబిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన తండ్రి ఎందుకో పిల్లల చదువులపై బెంగపడి ప్రాణాలు తీశాడు.. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమి వేశాడు. కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి ఊపిరి తీశాడు. చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి.. ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. పిల్లల కాళ్లు చేతులు తాళ్లతో కట్టి నీళ్ళల్లో ముంచి తండ్రి చంద్ర కిషోర్ చంపిన తీరు అందరినీ.. భయభ్రాంతులకు గురిచేసింది. ఇద్దరు పిల్లలను చంపి తర్వాత తాను ఉరివేసు కుని ఆత్మహత్య చేసు కున్నాడు.. పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చంద్రకిషోర్ సూసైడ్ నోట్ లో రాశాడు. వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకల పూడిలోని ఓ ఎన్ జి సి ఆఫీస్లో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అయితే పిల్లలు చదువులో వెనుకబడి ఉండటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. హోలీ పండుగ సందర్భంగా భార్య తనూజను, ఇద్దరు కుమారులు జోషిల్, నిఖిల్ను తీసుకుని చంద్రకిశోర్ తన ఆఫీస్కి వెళ్లాడు. అనంతరం పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నాని చెప్పి, భార్యను ఆఫీస్ లోనే ఉండమని నమ్మించి ఇద్దరు పిల్లలను తీసుకోని చంద్రకిశోర్ ఇంటికి వెళ్లాడు. ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత.. చంద్రకిషోర్ పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు ముంచి హత్య చేశాడు.. ఆపై తాను ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడంతో తోటి ఉద్యోగులతో కలిసి తనూజ ఇంటికి వెళ్లింది. కిటికీ నుంచి చూడగా భర్త, పిల్లలు విగతజీవులుగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇద్దరు పిల్లలను హత్య చేసి చంద్రకిషోర్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.