సీఎం రేవంత్ ఇలాకాలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా : పట్నం నరేందర్ రెడ్డి
కొడంగల్, మార్చి 26(ప్రజాక్షేత్రం):సీఎం రేవంత్రెడ్డి తన గురువైన ఏపీ సీఎం చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ ఆంధ్రాకు నీటిని తరలిస్తున్న కారణంగానే తెలంగాణలో నీటి సమస్య ఏర్పడిందని, తద్వారానే ప్రజలు తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. బుధవారం కొడంగల్ విచ్చేసిన ఆయన మధుసూధన్రెడ్డి అడ్వకేట్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి వైఖరి కారణంగానే తెలంగాణ ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. రిజర్వాయర్ల నిర్మాణం పనులు పూర్తి చేస్తే నీటి ఇబ్బందులు తలెత్తి ఉండేవి కావని పేర్కొన్నారు. గతంలోని కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు ప్రజలు ఎటువంటి తాగు, సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొనలేదని, సంతోషంగా వ్యవసాయం చేసుకోవడం జరిగిందన్నారు. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కకుండా.. ఇంటి వద్ద మిషన్ భగీరథ నీటిని అందుకున్నట్లు పేర్కొన్నారు. గత పది సంవత్సరాల కంటే ఈ సారి అధికంగా వర్షాలు కురిశాయని, నీటిని కాపాడుకునే చర్యలు చేపట్టని కారణంగానే నీటి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. గతంలోని బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గ పరిధిలో చెక్డ్యాంల నిర్మాణం, చెరువులు, కుంటల్లో నీటినిల్వలు పూర్తి స్థాయిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం వల్ల పంట పొలాలకు పుష్కలంగా నీళ్లు అందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఎక్కడి పంటలు అక్కడే ఎండిపోతున్నాయని, గత రెండు రోజుల క్రితం కురిసిన ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చినట్లు తెలిపారు. రైతుల నష్టాన్ని గుర్తించే విధంగా వ్యవసాయాధికారులచే సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఇప్పటి వరకు రైతులకు అందకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మార్చి 31 నాటికి రైతు భరోసా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటి వరకు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కేవలం ఉచిత బస్సు అమలు తప్ప మరే ఇతర పథకాలు అమలు కావడం లేదన్నారు. అధికారాన్ని దక్కించుకోవడానికి ఎన్నికల్లో నోటికి వచ్చిందల్లా మాట్లాడి.. ప్రజలను రేవంత్ ఓటు బ్యాంకులా వాడుకొన్నట్లు ఆరోపించారు. ప్రస్తుతం హామీలు అమలు చేసే పరిస్థితి లేదని సీఎం చేతులెత్తేయడం విడ్డూరంగా ఉందన్నారు. పథకాల మాట దేవుడరుగు కానీ ప్రస్తుతం రంజాన్ పండుగ సందర్భంగా పేద మైనారిటీ సోదరులకు అందించాల్సిన దుస్తులు, ఇఫ్తార్ విందు మాట కూడా ఎత్తడం లేదని ఎద్దెవా చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో ప్రతి పండుగకు ప్రతి వర్గానికి పండుగ కంటే ముందుగానే సంక్షేమ ఫలాలు అందేవని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇసుక రవాణాలపై కొరడా ఝులిపించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.. కానీ సొంత నియోజకవర్గంలో యథేచ్చగా అక్రమంగా ఇసుక రవాణా దందాలు, భూ దందాలు కొనసాగుతున్నట్లు ఆరోపించారు. ఇసుక రవాణా ఎవరి ఆధీనంలో జరుగుతున్నాయో సీఎంనే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. చెరువులు, చెక్డ్యాంలలో ఇసుకను తోడేస్తున్న కారణంగా భూమిలో నీటి నిల్వలు రోజు రోజుకు పడిపోతున్నాయని, కాబట్టే వేసవి ముదరక ముందే నీటి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. సొంత నియోజకవర్గంలోని సీఎం ఆదేశాలు జారీ కాకపోవగడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.
ప్రశ్నింస్తే అరెస్టులు, కేసుల వంటి పాలన సీఎం ఇలాఖాలో కొనసాగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సీఎం నియోజకవర్గానికి వచ్చేన ప్రతి సమయంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి ఇబ్బందులకు పాలు పడుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డిపై సస్పెషన్ను నిరసిస్తూ దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టి బొమ్మ దహనం చేస్తే కేసులు పెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా కేసీఆర్, కేటీఆర్ల దిష్టి బొమ్మలను దహనం చేస్తే వారిపై కేసు పెట్టాలని పిటిషన్ దాఖలు చేస్తే కేసులు బనాయించడం లేదన్నారు. సీఎం ఎందుకింత వివక్షతను చూపుతున్నాడని, బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, అక్రమ ఇసుక దందాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దామోదర్రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు మధుసూధన్రెడ్డి అడ్వకేట్, విష్ణువర్ధన్రెడ్డి, మధుసూధన్రావు యాదవ్, కోట్ల యాదగిరి, నారాయణరెడ్డి, మహేందర్రెడ్డి, నర్మదాకిష్టప్ప, రమేష్బాబు, నవాజోద్దిన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.