Praja Kshetram
జాతీయం

యూనస్‌తో మోడీ భేటీ

యూనస్‌తో మోడీ భేటీ

 

 

నేషనల్ బ్యూరో ఏప్రిల్ 04(ప్రజాక్షేత్రం):బంగ్లాదేశ్‌లో హిందువులతో సహా మైనారిటీలపై దాడులు జరగడం భారత్‌కు ఆందోళన కలిగిస్తోందని, ఈ అరాచకాలపై సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ఛీఫ్ అడ్వయిజర్ మహమ్మద్‌యూనస్‌తో భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించారు. బాధితులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందన్న నమ్మకంతో ఉన్నామని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. బిమ్‌స్టెక్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. గత ఏడాది ఆగస్టులో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలగి దేశం విడిచివెళ్లిన తరువాత భారత్, బంగ్లాదేశ్ నేతల మధ్య భేటీ జరగడం ఇదే మొదటిసారి. యూనస్‌తో మోడీ భేటీ తరువాత విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ ఈ వివరాలు తెలియజేశారు. సుస్థిర, ప్రగతిశీల, ప్రశాంత, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రజలే కేంద్రంగా ఉండే సంబంధాలకు భారత్ ప్రాధాన్యం ఇస్తుందని మోడీ పేర్కొనట్టు చెప్పారు. “ బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలను భారత్ కోరుకుంటోందని ప్రధాని తెలియజేశారు. సరిహద్దుల్లో అక్రమ వలసలను నియంత్రించాలని కోరారు. సరిహద్దు భద్రత, సుస్థిరత కాపాడేందుకు చొరబాట్లను అడ్డుకోవాలని కోరారు” అని మిస్రీ తెలిపారు.

Related posts