అధికారుల సమన్వయ లోపం.. మంత్రుల హెలికాప్టర్ ల్యాండింగ్లో పొరపాటు..
నిజామాబాద్ ఏప్రిల్ 21(ప్రజాక్షేత్రం):నిజామాబాద్ రైతు మహోత్సవంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. అధికారుల సమన్వయ లోపంతో ఒకచోట దిగాల్సిన తెలంగాణ మంత్రుల హెలికాప్టర్ మరో చోట దిగింది. వాస్తవానికి నిజామాబాద్ కలెక్టరేట్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం అధికారులు లాంచ్ ప్యాడ్ను ఏర్పాటు చేశారు. కానీ పైలెట్ మాత్రం ఆ లాంచ్ ప్యాడ్పై కాకుండా సభ ప్రాంగణంలో హెలికాప్టర్ను ల్యాండ్ చేశారు. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగత వేదిక కూలిపోయింది. పెద్దగా గాలి వీయడంతో జనం, పోలీసులు పరుగులు తీశారు. ఈ ఘటనలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. నిజామాబాద్ రైతు మహోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు హెలికాప్టర్లో వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.