Praja Kshetram
విద్యా సమాచారం

దోస్త్’ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారా? – ఆ కాపీ వచ్చిన తర్వాతే రిలీజ్!

‘దోస్త్’ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారా? – ఆ కాపీ వచ్చిన తర్వాతే రిలీజ్!

 

– దోస్త్ నోటిఫికేషన్ విడుదలపై సందిగ్ధత

– బకెట్‌ విధానం తొలగింపుపై విద్యాశాఖ అధికారి ఆగ్రహం

– ఈసారికి యథాతథంగా నిర్వహించాలని నిర్ణయం

– ఉన్నతాధికారుల సమావేశం తీర్మానాల కాపీ రాకపోడవడంతో ఆలస్యం

హైదరాబాద్ ఏప్రిల్ 29(ప్రజాక్షేత్రం):డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ – తెలంగాణ (దోస్త్) ద్వారా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటిరోజే దోస్త్ షెడ్యూల్ విడుదల చేసేవారు. ఈసారి ఫలితాలు వచ్చి వారం రోజులైనా నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో ఉన్నత విద్యామండలి అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఈసారి రెండు విడతల్లోనే దోస్త్ ద్వారా ప్రవేశాలు నిర్వహించి, జూన్ 15 నుంచి తొలి సెమిస్టర్ క్లాసులను ప్రారంభించాలనుకున్నారు. అయితే ఇప్పటివరకు నోటిఫికేషన్ వెలువడకపోవడంతో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తరగతులు ప్రారంభమవుతాయా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారణంతోనే లేట్ : దోస్త్‌ 2025లో బకెట్‌ విధానాన్ని తొలగించాలని కొద్దిరోజుల క్రితం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన వీసీల సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నత విద్యామండలికి గానీ, వీసీలకు గానీ లేదని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తమ ఆమోదం లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని విద్యాశాఖలోని ఓ అధికారి ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పది రోజుల క్రితం వీసీలతో సమావేశం నిర్వహించి, ఈసారికి యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఆ సమావేశానికి సంబంధించి తీర్మానాల కాపీ (మినిట్స్‌) ఇంతవరకు అందలేదు. దాంతో ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేయలేదని తెలుస్తోంది.

Related posts