నువ్వు చనిపోతే నేనెట్టా బతుకుతా బిడ్డా..
-కొడుకు మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య.
-కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన.
ప్రజాక్షేత్రం డెస్క్ మే 13: ఆ కుటుంబంలో చోటుచేసుకున్న విషాదాన్ని మరవకముందే మరో విషాదకర ఘటన జరిగింది. కొడుకు బలవన్మరణానికి పాల్పడడంతో తట్టుకోలేకపోయిన అతడి తండ్రి కూడా అదే పనిచేశాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.మన్నెంపల్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు కొడుకు నిఖిల్ (21) బెట్టింగులకు అలవాటు పడ్డాడు. అందుకోసం లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. చివరకు అప్పులు తీర్చే దారి కనపడక తీవ్ర ఒత్తిడితో రెండు నెలల క్రితం బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరుపతి రావుకు నిఖిల్ ఒక్కగానొక్క కొడుకు నిఖిల్ మృతితో తిరుపతిరావు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. తిరుపతి రావు వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. అతడిని స్థానికులు హైదరాబాద్లోని ఒక ఆసుపత్రికి తరలించారు. తిరుపతిరావు చికిత్స పొందుతూ మృతిచెందాడు.తండ్రీ కొడుకు ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబం తట్టుకోలేకపోతోంది. బెట్టింగుల వల్ల యువత జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. బెట్టింగుల జోలికి పోవద్దంటూ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ చాలా మంది యువకులు తమ తీరును మార్చుకోవడం లేదు.