Praja Kshetram
ఉద్యోగ సమాచారం

బీఈ/బీటెక్‌ విద్యార్హతతో ఆర్మీలో ఉద్యోగ అవకాశం

బీఈ/బీటెక్‌ విద్యార్హతతో ఆర్మీలో ఉద్యోగ అవకాశం

– తొలి నెల నుంచే లక్ష జీతం

ఆర్మీలో సేవలందించే అవకాశం

– టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోకి బీఈ/బీటెక్ విద్యార్హతతో నియామకం

హైదరాబాద్ మే 15(ప్రజాక్షేత్రం): బీఈ/బీటెక్‌ విద్యార్హతతో ఆర్మీలో సేవలందించే అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకున్నవారు, చివరి ఏడాది చదువుతున్నవారిని టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ)ల్లోకి ఇండియన్‌ ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి. ఎంపికైనవారికి శిక్షణ సమయంలో స్టైపెండ్‌ చెల్లిస్తారు.

అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ) ప్రకటనను దాదాపు ఏటా ఆర్మీ విడుదల చేస్తోంది. వీటికి వివాహం కాని పురుషులే అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తు రుసుం లేదు.

సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎంపిక విధానం :
వచ్చిన దరఖాస్తులను బీటెక్‌ మార్కుల మెరిట్‌ ప్రకారం వడపోస్తారు. ఇందులో నిలిచినవారిని సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ), బెంగళూరు కార్యాలయంలో ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటిని సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూయింగ్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో చేపడతారు.

తొలిరోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ (ఇంటలిజెన్స్‌) పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారినే స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. వీరిని నాలుగు రోజులపాటు పలు విభాగాల్లో పరీక్షించి, అందులో రాణించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు. ఇంటర్వ్యూకు హాజరైనవారికి ప్రయాణ ఖర్చులూ చెల్లిస్తారు.

ఏడాది పాటు శిక్షణ- ప్రతి నెలా స్టైఫండ్ :
కోర్సులోకి ఎంపికైనవారికి ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, దేహ్రాదూన్‌లో జనవరి, 2026 నుంచి సుమారు ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన తర్వాత లెవెల్‌-10 రూ.56,100 మూలవేతనంతోపాటు రూ.15,500 మిలటరీ సర్వీస్‌ పే అందుతాయి. వీటికి డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అందువల్ల తొలి నెల నుంచే సుమారు రూ.లక్షకుపైగా జీతం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయి హోదాలు సొంతం చేసుకోవచ్చు. రెండేళ్ల సర్వీసుతో కెప్టెన్, ఆరేళ్లు కొనసాగితే మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ కావచ్చు. ఇవి పూర్తి కాల పోస్టులు. పదవీ విరమణ వయసు వరకు విధుల్లో కొనసాగవచ్చు. అనంతరం జీవితాంతం పింఛనూ అందుకోవచ్చు.

పోస్ట్ ఖాళీలు – జాబ్ అర్హతలు :
ఖాళీలు: 30 విభాగాలవారీ: సివిల్, అనుబంధ విభాగాల్లో 8, కంప్యూటర్‌ సైన్స్‌ 6, ఎలక్ట్రికల్‌ 2, ఎలక్ట్రానిక్స్‌ అనుబంధ విభాగాల్లో 6, మెకానికల్‌ 6, ఇతర విభాగాల్లో 2 ఉన్నాయి.

అర్హత: నిర్దేశిత/ అనుబంధ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసినవారు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ పోస్టులకు ఎమ్మెస్సీ సీఎస్‌/ఐటీ విద్యార్హతలతోనూ పోటీ పడవచ్చు. అన్ని ఖాళీలకూ వివాహం కాని పురుషులే అర్హులు.

వయసు: జనవరి 1, 2026 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1999 – జనవరి 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 29 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు.

వెబ్​సైట్​: https://joinindianarmy.nic.in/

Related posts