ప్యాకెట్ ఫుడ్ తింటున్నారా?
హైదరాబాద్ మే 18(ప్రజాక్షేత్రం):ప్రపంచ వ్యాప్తంగా అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకెట్ ఫుడ్కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇంట్లో వంటలు వండుకునే ఓపిక లేక ప్యాకెట్ ఫుడ్ మీద ఆధారపడుతున్నారు. ఆరోగ్యానికి హాని కలుగుతుందని తెలిసినా.. అందులోని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారు. అతిగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ప్రాణాలు తొందరగా పోయే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. అమెరికన్ జర్నల్ ప్రివెంటివ్ మెడిసిన్లో పబ్లిష్ అయిన పరిశోధనకు సంబంధించిన రిపోర్టు ప్రకారం.. శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, కొలంబియా, మెక్సికో, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్లలో ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నవారు త్వరగా చనిపోయినట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ వంటకాల కంటే.. రెడీ టు ఈట్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినటం ఎక్కువైంది. ల్యాబరేటరీ పద్ధతుల ద్వారా సరైన పోషక విలువలు లేకుండా తయారు అవుతున్న ఆ తిండి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనిపై పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన బ్రెజిల్ దేశానికి చెందిన ఎడ్వర్డ్ అటస్టో ఫెర్నాండజ్ నెల్సన్ మాట్లాడుతూ.. ‘ఆహార పదార్థాలను చాలా రకాలుగా ప్రాసెస్ చేసి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తయారు చేస్తున్నారు. వాటిలో రంగులు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు, స్వీట్నర్స్తో పాటు చాలా రకాల ప్రమాదకర పదార్థాలు వాడుతున్నారు. ఈ పదార్థాల కారణంగా మన ఆరోగ్యంపై ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం పడుతుంది. త్వరగా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అతిగా తినటం వల్ల 32 రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. కార్డియో వాస్క్యూలర్ డిసీజ్, డయాబెటిస్, కొన్ని రకాలా క్యాన్సర్లతో పాటు డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్కు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. సంప్రదాయ పద్దతుల్లో తయారైన వంటల్నే తినాలి’ అని అన్నారు.