విజిలెన్స్కు చిక్కిన అవినీతి తిమింగలం..
– చీఫ్ ఇంజినీర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు స్వాధీనం..
ఒడిశా మే 30(ప్రజాక్షేత్రం):ఒడిశా లోని భువనేశ్వర్ లో ఓ భారీ అవినీతి తిమింగలం విజిలెన్స్కు చిక్కింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్న బైకుంత నాథ్ సారంగి నివాసాల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిన చూసి షాకవడం అధికారుల వంతైంది. సారంగి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు చేపట్టారు. ఒడిశాలోని అంగుల్, భువనేశ్వర్, పూరిలోని పిపిలి సహా మొత్తం ఏడు ప్రాంతాల్లోని సారంగి నివాసాలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాదాపు రూ.2.1 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని పది మంది అధికారులు లెక్కపెట్టారు. విజిలెన్స్ అధికారులు తన ఫ్లాట్ వద్దకు రాగానే సారంగి ఇంట్లోని నోట్ల కట్టలను కిటికీలోంచి బయటపడేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అంగుల్లోని అతని నివాసంలో జరిపిన సోదాల్లో రూ.1.1 కోట్లు, భువనేశ్వర్ ఫ్లాట్లో మరో రూ.కోటి దొరికాయి. నగదుతోపాటు పలు పత్రాలు, బంగారు ఆభరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుసకున్నట్లు తెలిసింది. ఎనిమిది మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులు, 12 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లు సహా 26 మంది పోలీసు అధికారుల బృందంతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు.