మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు
– భారీగా విదేశీ మద్యం, మత్తులో మహిళలు
చేవెళ్ల జూన్ 11(ప్రజాక్షేత్రం): ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అయింది. మంగ్లీ తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు కూడా వెళ్లారు. దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి పార్టీలో పాల్గొన్నారు. వేడుకలలో గంజాయి, విదేశీ మద్యం ఉపయోగించారని పోలీసులు నిర్ధారించారు. ఈ వేడుకలో ఇండస్ట్రీకి సంబంధించిన వారు 50 మంది పాల్గొనగా వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మంది గంజాయి తీసుకున్నారని తేలింది. దీంతో వెంటనే మంగ్లీ మీద కేసు నమోదు చేశారు.
కీలక విషయాలు..
కేసు ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు ప్రస్తావించారు పోలీసులు. చేవేళ్ల ఎస్ఐ శిరీష రాత్రి 12 గంటల 45 నిమిషాలకు పెట్రోలింగ్ చేస్తుండగా ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్ నుంచి పెద్దఎత్తున శబ్దాలు వినిపించాయి. దీంతో ఆమె సిబ్బందితో కలిసి రిసార్ట్ లో దాడులు చేశారు. ఆ సమయంలో 10 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నట్లు గుర్తించారు. అయితే బర్త్ డే పార్టీ, లిక్కర్, డీజేకి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వారిపై కేసు నమోదు చేశారు. అలాగే అనుమానంతో డ్రగ్ కిట్లతో అందరికీ టెస్టులు చేయగా ఒకరికి (దామోదర్) గంజాయి పాజిటివ్ గా వచ్చింది. దీంతో అతడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులు అనుమతి జారీ చేయని విదేశీ మద్యం అక్కడ పెద్దఎత్తున ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన ఎటువంటి లైసెన్స్ లేకపోవడాన్ని కూడా వారు ధృవీకరించారు. అనంతరం మంగ్లీని విచారించగా, ఈ పార్టీకి సంబంధించి డీజే, మద్యం వంటివన్నీ అనుమతి లేకుండానే ఏర్పాటు చేసినట్లు ఆమె అంగీకరించారు. పార్టీకి హాజరైన ప్రతి ఒక్కరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, అందులో ఒక వ్యక్తి గంజాయి తీసుకున్నట్లు పాజిటివ్ ఫలితం వచ్చింది. దీని ఆధారంగా తీసుకుని పోలీసులు మంగ్లీతో పాటు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్లపై కేసులు నమోదు చేశారు. పార్టీలో డ్రగ్స్ తీసుకుంటే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని పోలీసులు అంటున్నారు.