రేషన్ కార్డు కోసం లంచం: ఏసీబీ వలలో తహశీల్దార్ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్!
– కొత్త రేషన్ కార్డు కోసం లంచం డిమాండ్
– బూర్గంపహాడ్ తహశీల్దార్ కార్యాలయంలో ఘటన
– రూ.2,500 తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కంప్యూటర్ ఆపరేటర్
– డిజిటల్ పద్ధతిలోనూ లంచాలు స్వీకరిస్తున్నట్లు ఆరోపణలు
– లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ విజ్ఞప్తి
– ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడి
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 21(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిరోధించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా, కొందరు ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే, బూర్గంపహాడ్ మండల తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న చిట్టెంశెట్టి నవక్రాంత్, ఒక వ్యక్తి బంధువుకు సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తును ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి, కొత్త కార్డు జారీ కోసం ఉన్నతాధికారులకు పంపించేందుకు సహాయం చేస్తానని నమ్మబలికాడు. ఈ పని చేసిపెట్టడానికి రూ.2,500 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఈ విషయాన్ని తెలంగాణ ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. వారి సూచన మేరకు, శనివారం నవక్రాంత్కు రూ. 2,500 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు నవక్రాంత్ తరచూ రేషన్ కార్డు దరఖాస్తుదారుల నుంచి డిజిటల్ చెల్లింపుల రూపంలో కూడా లంచాలు స్వీకరిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఏసీబీ అధికారులు తెలిపారు.