Praja Kshetram
తెలంగాణ

వచ్చే వారాల్లో నూతన అక్రిడేషన్ జారీ విధివిధానాలపై చర్చిద్దాం.

వచ్చే వారాల్లో నూతన అక్రిడేషన్ జారీ విధివిధానాలపై చర్చిద్దాం.

 

– ఏ నిమిషం కూడా మిమ్మల్ని మర్చిపోను… విస్మరించను’

– ఇండ్ల స్థలాల జారీ ప్రక్రియ కోర్టు పరిధిలోని అంశం

– ఎలా చేస్తే జర్నలిస్టులకు మేలు చేకూరుతుందో… న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం

– టీయూడబ్ల్యూజే (ఐజేయూ) 4వ జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

వైరా జూలై 24(ప్రజాక్షేత్రం):ఏ నిమిషం కూడా జర్నలిస్టులను మర్చిపోను… విస్మరించనని… ఇందిరమ్మ ప్రభుత్వ ఏర్పడ్డంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకమని…. గత 18నెలలుగా ప్రజాపాలన సజావుగా సాగడంలో వారి సహకరం ఉందని… వారి న్యాయపరమైన కోరికలు తీర్చడానికి ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. వైరాలోని శబరి గార్డెన్స్లో గురువారం జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) 4వ జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… రంగ రంగ వైభవంగా వైరా పట్టణంలో ఏర్పాటు చేసుకున్న ఐజేయూ మహాసభకు నేను రావడం ఆనందంగా ఉంది. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న ఆనాటి ప్రభుత్వంలో నేనూ కొంతకాలం ఉన్నప్పటికీ మీకోసం ఏమి చేయలేని నిస్సహాయక స్థితిలో కొనసాగాను. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, నిజాన్ని వెలికితీయడంలో మీరు పడ్డ బాధలు నాకు తెలుసు. ఈ జిల్లాలోనే కాదు… రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది ఇబ్బందులు పడ్డ జర్నలిస్టులు ఉన్నారు. మీరు కోరుకున్న మూడు కోరికల్లో ఒకటి ఇండ్ల స్థలాల కేటాయింపు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. ఎలా చేస్తే జర్నలిస్టులకు మేలు చేకూరుతుందో…. న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం. నూతన అక్రిడేషన్ జారీ విధివిధానాలపై సోమ లేదా మంగళవారాల్లో చర్చించి ఎలా చేస్తే బాగుంటుందో ఓ నిర్ణయం తీసుకుందాం. దీనిపై ఓ స్పష్టత వస్తే హెల్త్ కార్డులు ఇవ్వడమనేది పెద్ద ఇబ్బంది కాదు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చేదాంట్లో జర్నలిస్టులు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఎట్టి పరిస్థితుల్లో నేను కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మీ న్యాయమైన కోరికలను నెరవేర్చే దాంట్లో పాజిటివ్ దృక్పథంతో ముందుంటామని మరోమారు స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. ఏదైనా ఓ నిర్ణయం తీసుకుంటే అది కాంప్లికేటెడ్ కావొద్దని… ఏ ఒక్కరూ కూడా వేలెత్తి చూపొద్దని ఉద్దేశ్యంతో మీడియా మిత్రుల కోరికల అమలుకు కాస్తా జాప్యం జరుగుతుంది. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఈ ప్రభుత్వం ఇవ్వదని పేర్కొంటూ ఈ సభకు ఆహ్వానించిన సభ్యులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి పొంగులేటి తన ప్రసంగాన్ని ముగించారు.

Related posts