Praja Kshetram
జాతీయం

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి..

 

– స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

 

న్యూఢిల్లీ జులై 31(ప్రజాక్షేత్రం):పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసన సభ స్పీకర్‌ను ఆదేశించింది. తీర్పు వచ్చిన తర్వాత మూడు నెలలకు మించకుండా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఏండ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్‌లో ఉంచడం సరికాదని తెలిపింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్‌ బెంట్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది. 2023 నవంబర్‌లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌, ప్రకాశ్‌గౌడ్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్‌, పాడి కౌశిక్‌రెడ్డి వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌తోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వేసిన రిట్‌ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి స్పీకర్‌కు కోర్టులు సూచనలు చేయడం, చర్యలు తీసుకోవడానికి నిర్దేశిత కాలపరిమితి విధించే అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా? అన్న అంశంపై సుప్రీంకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తరఫున న్యాయవాదుల వాదనలను విన్నది. మూడు రోజులపాటు వరుసగా దీనిపై వాదనలు నడిచాయి. తుది తీర్పును రిజర్వు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 3న ప్రకటించింది. దేశంలోని రెండు రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన అంశం కావడంతో సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం.. మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సూచిస్తూ తీర్పును వెలురించింది. దీంతో అక్టోబర్‌ 31వ తేదీలోపు ఫిరాయింపు పిటీషన్లపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Related posts