బోనాల పండుగలో మరోసారి బయటపడ్డ కుల వివక్ష
మిడ్జిల్ ఆగస్టు 18(ప్రజాక్షేత్రం):గతంలో దళితులు శ్రీరామనవమి రోజు ఆలయంలోకి ప్రవేశించారు. అప్పటినుండి గ్రామంలో ఇతర కులస్తులు దేవాలయంలోకి రావడం లేదు. దళితులు ఆలయ ప్రవేశం చేయడం వల్లే గ్రామంలో ఒక్కసారిగా కుల వివక్షత బయటపడింది. సోమవారం మండలంలోని బైరంపల్లి గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో బోనాల నిర్వహణకు ఖర్చుల కోసం చెందాలు చేశారు. అందులో భాగంగా దళితులు కూడా చెందాలు ఇచ్చారు. బోనాల ఏర్పాట్లకు దళితులతో తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేశారు. గ్రామస్తులు ఒక వర్గం వారు దళితులతో డప్పులు కొట్టించకుండా వేరే గ్రామం నుండి డప్పులు తెచ్చి బోనాల ఉత్సవాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే మేము ఉండగా వేరే ఊరు నుండి కొత్తగా పిలిపించి డప్పులు కొట్టించడమేందని ప్రశ్నించారు. దళితులమని చిన్నచూపు చూస్తూ కుల వివక్షతను పెంచి పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ప్రవేశం చేసినప్పటి నుండి మా పొలాలలో పనులకు కూడా ఎవరు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఎవరు పనులకు రాకపోవడంతో వేరే గ్రామాల నుండి కూలీలను తీసుకువచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నామని తెలిపారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. సంఘటనపై పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించిన ఎవరు రాలేదని వాపోయారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని కోరారు. తమను అంటరాని వారిగా చూస్తూ అవమాన పరుస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
