మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
హైదరాబాద్ ఆగస్టు 19(ప్రజాక్షేత్ర):హైదరాబాద్ నగరంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. చేవేళ్ల మాజీ ఎంపీ రంజిత్రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న డీఎస్ఆర్ గ్రూప్ కంపెనీలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. మంగళవారం ఉదయం ఏకకాలంలో హైదరాబాద్తో పాటు బెంగళూరులోని 27 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. జగిత్యాల జిల్లాకు చెందిన గడ్డం రంజిత్రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎదిగారు. ఆయన 2019లో బీఆర్ఎస్ నుంచి చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2024లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల సమయంలో ఆయన తన అఫిడవిట్లో రూ.435 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించాడు. ఆయన అత్యంత ధనవంతులైన మాజీ ఎంపీలలో ఆయన ఒకరిగా నిలిచిచారు. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు మాజీ ఎంపీ రంజిత్రెడ్డి ఇంటితో పాటు, డీఎస్ఆర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర గ్రూప్ సంస్థల ఆఫీసులు, కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్థిక రికార్డులు, సంబంధిత లావాదేవీలను పరిశీలించారు. మాజీ ఎంపీకి చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. ప్రాజెక్టులలో లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను వెలికితీయడమే ఈ సోదాల లక్ష్యమని అధికారులు తెలిపారు. డీఎస్ఆర్ స్కైవన్, డీఎస్ఆర్ వరల్డ్ వెంచర్ల వంటి ప్రాజెక్టులలో ఫ్లాట్లు చదరపు అడుగుకు రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు విక్రయించినట్లు సమాచారం. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో మాత్రం రూ.7 వేలుగా చూపినట్లు అధికారులు గుర్తించారు.
– కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
మాజీ ఎంపీతో ఐటీ శాఖ గ్రూప్ డైరెక్టర్లు దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి ఇళ్లలోను అధికారులు సోదాలు జరిపారు. జూబ్లీ హిల్స్లోని గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్ బెంగళూరులోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఇందులో భాగంగా పలు అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం 400 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
