రిజిస్ట్రేషన్ కోసం రూ.లక్ష లంచం.. ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
రంగారెడ్డి జిల్లా ఆగస్టు 22(ప్రజాక్షేత్రం):అవినీతి అధికారులు మారడం లేదు. లంచం తీసుకోనిదే పనులు చేయడం లేదు. ఓ వైపు ఏసీబీ అధికారులు నిత్యం దాడులు చేస్తూ.. కేసులు పెడుతున్నా లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. లంచం తీసుకోవడం కూడా ఒక డ్యూటీగా భావిస్తున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్గా ఎస్.రాజేష్ కుమార్ పని చేస్తున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి తన ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారిని సంప్రదించాడు. ఆస్తి నమోదు ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ రాజేష్ కుమార్ రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. డాక్యుమెంట్ రైటర్ కార్యాలయంలో పని చేస్తున్న నాగోలుకు చెందిన టైపిస్ట్ కె రమేష్ ద్వారా శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ రూ.70 వేల లంచం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సబ్రిజిస్ట్రార్ రాజేష్ కుమార్తో పాటు టైపిస్ట్ రమేష్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
– డాక్యుమెంట్ రైటర్లదే హవా..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల రాజ్యం నడుస్తోంది. సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది వారి ద్వారానే లంచాలు తీసుకుంటున్నారు. నిత్యం కార్యాలయంలో ప్రజల కంటే డాక్యుమెంట్ రైటర్ల హడావుడి అధికంగా ఉంటుంది. కార్యాలయంలోకి వారిని అనుమతించవద్దని ఆదేశాలు ఉన్నా.. అధికారులు లెక్క చేయడం లేదు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు నేరుగా వస్తే పనులు చేయడం లేదు. డాక్యుమెంట్ రైటర్ ద్వారా వచ్చి.. అధికారుల చేతులు తడిపితేనే పనులు సాగుతున్నాయి. అంతేగాకుండా పలు చోట్ల అధికారులు డబ్బులు తీసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేపడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదు. శుక్రవారం ఒక్క రోజే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఏసీబీకి చిక్కడంతో ఆ శాఖలో చర్చనీయాంశం అయింది. ఆదిలాబాద్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరెడ్డి సైతం రూ.5 వేలు లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.
– లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్, వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
