Praja Kshetram
తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో గణేశ్ విగ్రహం

సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో గణేశ్ విగ్రహం

 

– సీఎం రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుడు.. హైదరాబాద్‌లో ప్రత్యేక ఆకర్షణ

– హైదరాబాద్‌ గోషామహల్ పరిధిలోని అఘాపురాలో ఏర్పాటు

– ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ చొరవ

– జూబ్లీహిల్స్‌ నివాసంలో సీఎం కుటుంబసమేత పూజలు

– వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు

వినాయక చవితి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు వినూత్న రీతుల్లో గణనాథుని విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ తమ భక్తిని, అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపంలో ఏర్పాటు చేసిన ఓ వినాయకుడి విగ్రహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని అఘాపురాలో ఈ ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోలినట్లుగా ఈ గణపతి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. సీఎం తరహాలో ఉన్న ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు, భక్తులు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని ఇంట్లో తన అర్ధాంగి గీత, కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts