Praja Kshetram
జాతీయం

ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లక్కర్లేదు!

ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లక్కర్లేదు!

– మొబైల్​లోనే పేరు, అడ్రస్​, నంబర్ మార్పులు చేర్పులు!!

– ఏఐ, ఫేస్​ ఐడీ ఫీచర్లతో కొత్త ఈ-ఆధార్ యాప్

​- ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనే లేదు!

నేషనల్ బ్యూరో సెప్టెంబర్ 13(ప్రజాక్షేత్రం):ఆధార్ కార్డ్ యూజర్లు అందరికీ గుడ్ న్యూస్​. త్వరలోనే ఏఐ, ఫేస్​ ఐడీ ఫీచర్లతో కొత్త ‘ఈ-ఆధార్​ యాప్​’ను లాంఛ్ చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సిద్ధమవుతోంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే మీ మొబైల్​లోనే మీరు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్​ అప్డేట్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఎవరైనా తమ ఆధార్​ వివరాలను అప్డేట్ చేయాలంటే, కచ్చితంగా ఆధార్ నమోదు కేంద్రాలకు 0వ్యక్తిగతంగా వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల చాలా సమయం, డబ్బు వృథా అవుతోంది. చిన్న అప్డేట్ చేయాలన్నా ఆధార్ సెంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఉద్యోగులు అయితే ఒక రోజు సెలవు పెట్టాల్సి వస్తోంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లోని ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు యూఐడీఏఐ సిద్ధమవుతోంది. సరికొత్త ఈ-ఆధార్​ మొబైల్ యాప్​ను అభివృద్ధి చేస్తోంది.

బయోమెట్రిక్​ డేటా మార్చుకోవచ్చా?

కొత్త యాప్​ అందుబాటులోకి వచ్చినప్పటికీ, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్​ లాంటి బయోమెట్రిక్​ డేటాలో మార్పులు చేయాలంటే, కచ్చితంగా వ్యక్తిగతంగా ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూఐడీఏఐ ‘బయోమెట్రిక్​ అప్డేట్’ గడువును 2025 నవంబర్​ వరకు పొడిగించింది.

ఇంతకీ ఇది సురక్షితమేనా?

ఏఐ, ఫేస్ ఐడీ ఫీచర్లతో కొత్త ‘ఈ-ఆధార్ యాప్’​ను తీసుకువస్తున్నారు. కనుక ఆధార్​ వివరాల అప్డేట్​ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. పైగా ఇది సురక్షితంగా ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలంటే పాస్​వర్డులు, ఓటీపీలు ఎంటర్ చేయాల్సి వస్తోంది. కానీ కొత్త యాప్​ అందుబాటులోకి వస్తే ఫేస్​ ఐడీతో నేరుగా లాగిన్ అవ్వవచ్చు. వివరాలు అప్డేట్ చేయవచ్చు. కనుక యూజర్ల వ్యక్తిగత వివరాల చోరీకి, మోసాలకు అవకాశం తగ్గుతుంది.

ఆటోమేటిక్ వెరిఫికేషన్​

కొత్త యాప్ వచ్చిన తరువాత ఆటోమేటిక్​గా వెరిఫికేషన్ పూర్తి అయిపోతుంది. ఎలా అంటే? యూజర్​ తన ఆధార్​ చిరునామా వివరాలు సమర్పిస్తే, ఆ వివరాలు సరైనవో, కావో క్రాస్​-వెరిఫికేషన్ చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వ డేటా బేస్​ను ఉపయోగిస్తుంది. అంటే మీ పాన్​ డేటాబేస్​, పాస్​పోర్ట్ ఆఫీస్​​, డ్రైవింగ్ లైసెన్స్​ రిజిస్ట్రీ సహా ఇతర వివరాలను ఆటోమేటిక్​గా వెరిఫై చేస్తుంది. దీనితో పాటు మీ చిరునామా నిర్ధరణ చేయడానికి, మీ విద్యుత్​ బిల్లులు వంటి వాటిని కూడా తనిఖీ చేస్తుంది.

ఈ కొత్త యాప్ అవసరమా?

భారతదేశంలో 130 కోట్లకు పైగా ఆధార్​ కార్డు హోల్డర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది మారుమూల ప్రాంతాల్లో, ఇంటర్నెట్​ అందుబాటులో లేని స్థితిలో ఉన్నారు. చాలా మందికి డిజిటల్ అక్షరాస్యత, ప్రయాణ సౌకర్యాల లేమి లాంటి సమస్యలు ఉన్నాయి. ఉద్యోగులకు సరైన సమయానికి సెలవులు దొరకని పరిస్థితి- ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అందువల్ల కొత్త ఈ-ఆధార్​ యాప్ తీసుకువస్తే, వీళ్లతోపాటు అందరికీ కచ్చితంగా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ​ఆధార్​ను చాలా సులువుగా అప్డేట్ చేసుకోవడానికి వీలవుతుంది. అందుకే ఎలక్ట్రానిక్స్​ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, యూఐడీఏఐ కొత్త ఈ-ఆధార్ మొబైల్ యాప్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాయి.

Related posts