‘జాగృతిలో చేరే వారికి సముచిత స్థానం’.. కల్వకుంట్ల కవిత భరోసా
కుత్భుల్లాపూర్ సెప్టెంబర్ 24(ప్రజాక్షేత్రం):పేదల పక్షాన నిలవటమే జాగృతి ప్రధాన లక్ష్యమని.. కుత్భుల్లాపూర్లో హైడ్రా పేదల ఇళ్లు కూల్చితే మొదట వారికి మద్దతుగా నిలిచింది జాగృతియేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం తెలంగాణ జాగృతిలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు పాండు రంగారెడ్డి, బీఎస్పీ మల్కాజిగిరి ఇన్చార్జి అందుగుల సత్యనారాయణ సహా పలువురు ఉద్యమకారులు చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. పేదల పక్షాన పనిచేసే శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని చెప్పారు. జాగృతిలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నాడు ఉద్యమంలో పనిచేశామని.. రాష్ట్రాన్ని సాధించిన విన్నింగ్ టీమ్గా నిలిచామని తెలిపారు. సామాజిక తెలంగాణను సాధించుకోవడమే ఇప్పుడు తమ ముందు ఉన్న లక్ష్యమని చెప్పారు. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని ఆలోచన చేస్తున్నామని.. అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. పాత శక్తులందరం కలిసిన సందర్భంగా మన పవర్ ఏంటన్నది తెలంగాణ సమాజం గమనిస్తదని తెలిపారు. ఉద్యమకారులు సైతం ఉద్యమకారుల ఫోరమ్ పేరుతో పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. కళాకారులు సైతం తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు.
