చేవెళ్ల బస్సు ప్రమాదం.. సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
హైదరాబాద్, నవంబర్ 4(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తమ వారిని కోల్పోయి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. మీడియా ఛానల్స్, పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ చర్యలు తీసుకుంది. ఈ సంఘటనపై డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రోడ్లు రవాణా, భవనాల శాఖ, హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీలకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్ కు కూడా నివేదిక సమర్పించాలని హెచ్ఆర్సీ ఆదేశించింది. మరోవైపు చేవెళ్ల బస్సు ప్రమాదంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన స్థలాన్ని డీజీపీ శశిధర్ రెడ్డి, సీపీ అవినాష్ మహంతి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు.(సోమవారం) తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. బస్సును కంకర లోడ్తో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న కంకర మొత్తం బస్సులో కుప్పగా పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 34 మంది గాయపడటంతో వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టిప్పర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
