Praja Kshetram
జాతీయం

80 వేల మంది చూస్తుండగా.. 13 ఏళ్ల బాలుడితో హంతకుడికి మరణశిక్ష!

80 వేల మంది చూస్తుండగా.. 13 ఏళ్ల బాలుడితో హంతకుడికి మరణశిక్ష!

 

 

నేషనల్ బ్యూరో డిసెంబర్ 03(ప్రజాక్షేత్రం):ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలనలో అనాగరిక, ఆటవిక న్యాయం మరోసారి బయటపడింది. ఒకే కుటుంబంలో 13 మందిని దారుణంగా హత్య చేసిన వ్యక్తికి, మృతుల కుటుంబానికి చెందిన 13 ఏళ్ల బాలుడి చేత మరణశిక్షను అమలు చేయించారు. కోస్త్ ప్రావిన్స్‌లోని ఓ క్రీడా మైదానంలో సుమారు 80,000 మంది ప్రేక్షకుల సమక్షంలో ఈ బహిరంగ శిక్షను అమలు చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.

అస‌లేం జ‌రిగిందంటే..!

మంగళ్ అనే వ్యక్తి సుమారు 10 నెలల క్రితం అబ్దుల్ రెహమాన్‌తో పాటు అతని కుటుంబంలోని 13 మందిని, అందులో తొమ్మిది మంది పిల్లలను హత్య చేశాడు. ఈ కేసులో దోషిగా తేలిన మంగళ్‌కు తాలిబన్ల సుప్రీంకోర్టు “కిసాస్” (ప్రతీకారం) చట్టం కింద మరణశిక్ష విధించింది. ఈ శిక్షను అమలు చేసేందుకు అధికారులు ప్రజలను బహిరంగంగా ఆహ్వానించారు. శిక్ష అమలుకు ముందు, దోషిని క్షమించే అవకాశం ఉందా? అని ఆ 13 ఏళ్ల బాలుడిని అడిగారు. అయితే, అందుకు ఆ బాలుడు నిరాకరించడంతో అతని చేతికే తుపాకీ ఇచ్చి దోషిని కాల్చి చంపమని ఆదేశించారు. 2021లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత ఇలా న్యాయవ్యవస్థ ద్వారా మరణశిక్ష అమలు చేయడం ఇది 11వ సారి. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్ ఈ చర్యను “అమానవీయమైన, క్రూరమైన శిక్ష” అని అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇలాంటి వాటిని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. తాలిబన్లు షరియా చట్టం పేరుతో బహిరంగ ఉరిశిక్షలు, కొరడా దెబ్బలు వంటి కఠిన శిక్షలను తిరిగి ప్రవేశపెట్టడంపై మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Related posts