Praja Kshetram
క్రైమ్ న్యూస్

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థుల దుర్మరణం.

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థుల దుర్మరణం.

 

– చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురు అక్కడికక్కడే మృతి.

– మృతులంతా ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీ విద్యార్థులు.

– మోకిల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన.

శంకర్ పల్లి జనవరి 08(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ఓ స్పోర్ట్స్ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో నలుగురు యూనివర్సిటీ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన శంకర్ పల్లి మండల పరిధిలోని మీర్జాగూడ గ్రామ సమీపంలో జరిగింది. మృతులంతా ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఐసీఎఫ్ఏఐ విద్యార్థులైన సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్ మోకిల నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. మీర్జాగూడ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ఉన్న నలుగురు విద్యార్థులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Related posts