సీఏఏ అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
లఖ్నవూ మే 16 (ప్రజాక్షేత్రం): సీఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు..
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై ధ్వజమెత్తారు.
”భారత్కు వచ్చిన శరణార్థులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దేశ విభజన, ఇతర కారణాలతో దేశంలో చాలా ఏళ్లుగా శరణార్థులు ఇక్కడ జీవిస్తున్నారు. ఆ బాధితులకు కేంద్రం సీఏఏ ద్వారా పౌరస్వతం కల్పిస్తోంది. కానీ, ఎస్పీ, హస్తం పార్టీ ఈ చట్టంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి” అని ప్రధాని దుయ్యబట్టారు. యూపీలోని అజంగఢ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
అలా ఎన్నటికీ జరగదు..
”అధికారం సాధిస్తే సీఏఏను రద్దు చేసేందుకు ఇండియా కూటమి యోచిస్తోంది. కానీ, అది ఎన్నటికీ జరగదు. ఈ చట్టాన్ని తొలగించడం అసాధ్యం. వారంతా మోసగాళ్లు (ప్రతిపక్ష నేతలను ఉద్దేశిస్తూ). మతోన్మాద మంటల్లో దేశం కాలిపోయేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు”అని మోదీ ప్రతిపక్షాలపై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా.. సీఏఏ చట్టం ప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనల్ని రూపొందించిన సంగతి తెలిసిందే. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి భారత్కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.