Praja Kshetram
జాతీయం

కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండబట్టే పాక్‌ చేతికి బాంబు స్థానంలో భిక్షపాత్ర వచ్చింది : ప్రధాని మోదీ

కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండబట్టే పాక్‌ చేతికి బాంబు స్థానంలో భిక్షపాత్ర వచ్చింది : ప్రధాని మోదీ

 

 

హర్యానా మే 18 (ప్రజాక్షేత్రం): కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏం చేయాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచిస్తాడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో జరిగిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. కేంద్రంలో గత పదేళ్లుగా దమ్మున్న ప్రభుత్వం ఉంది కాబట్టే పాకిస్థాన్‌ చేతికి ఇప్పుడు బాంబుకు బదులుగా భిక్షపాత్ర వచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.‘పాకిస్థాన్‌ దగ్గర ఆటం బాంబు ఉన్నది జాగ్రత్త’ అని కాంగ్రెస్‌ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పైవిధంగా స్పందించారు. తాను మణిశంకర్‌ మాట్లాడిన ఒక వీడియోను ఫోన్‌లో చూశానని, అందులో ఆయన ‘భారత్‌.. పాకిస్థాన్‌ను గౌరవించి తీరాలి. ఎందుకంటే పాకిస్థాన్‌ దగ్గర ఆటం బాంబు ఉంది’ అని వ్యాఖ్యానించారని మోదీ చెప్పారు. ఇండియా కూటమికి చెందిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ప్రధాని గుర్తుచేశారు.కానీ గత పదేళ్లుగా కేంద్రంలోని బలమైన ప్రభుత్వం పాకిస్థాన్‌ను కట్టడి చేసిందని, వారి చేతిలో బాంబుకు బదులుగా ఇప్పుడు భిక్ష పాత్ర ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏదైనా చేయాలనుకుంటే ఒకటి వందసార్లు ఆలోచించాల్సి వస్తుందని చెప్పారు. కేంద్రంలో సర్కారు బలంగా ఉంది కాబట్టే జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దుచేసి అభివృద్ధికి బాటలు వేశామని అన్నారు.

Related posts