తెలంగాణలోని పది వర్సిటీలకు ఇన్చార్జి వీసీల నియామకం
హైదరాబాద్ మే 21 (ప్రజాక్షేత్రం): తెలంగాణ పది యూనివర్సిటీలకు ఇన్చార్జీ వీసీలుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో గత వీసీల పదవీ కాలం ముగిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 మే 22న పది వర్సిటీలకు వీసీలను నియమించింది. ఓయూ, కాకతీయ, జేఎన్టీయూ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, జవహర్లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీల వీసీల పదవి కాలం నేటితో ముగియగా.. సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిశోర్, జేఎన్టీయూ బాధ్యతలను బుర్ర వెంకటేశ్కు అప్పగించింది. కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీగా వాకాటి కరుణ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రిజ్వి, తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా, తెలుగు యూనివర్సిటీ బాధ్యతలను శైలజ రామయ్యర్కు అప్పగించింది. మహాత్మా గాంధీ వర్సిటీకి నవీన్ మిట్టల్, శాతవాహన సురేంద్ర మోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్కి జయేశ్ రంజన్, పాలమూరు వర్సిటీ ఇన్చార్జి వీసీగా నదీం అహ్మద్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.