Praja Kshetram
జాతీయం

కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు.. తనిఖీ చేసిన పోలీసులకు షాక్

కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు.. తనిఖీ చేసిన పోలీసులకు షాక్

 

ఢిల్లీ మే 22 (ప్రజాక్షేత్రం): దేశరాజధాని ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయ నార్త్ బ్లాక్‌కు బుధవారం బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో సంబంధిత అన్ని భద్రతా విభాగాలను అప్రమత్తం చేశారు. నార్త్ బ్లాక్ వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.కంట్రోల్ రూంకి ఆగంతకుల నుంచి మెయిల్ వచ్చిందని.. దీంతో బాంబ్ స్వ్కాడ్ బృందాలు నార్త్ బ్లాక్ వద్దకు చేరుకుని విస్తృతంగా తనిఖీ నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదని, ఆకతాయిల పనిగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నార్త్ బ్లాక్ వీవీఐపీ ఏరియా.
ఇందులో హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ వంటి అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఏప్రిల్‌లో సైతం ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్‌లు వచ్చాయి.కొన్ని వారాల క్రితమే ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని 100 పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్‌లు వచ్చాయి.బాంబు బెదిరింపులతో రాజధాని ప్రజలు ఉలిక్కిపడ్డారు. తాజాగా మరో బెదిరింపు మెయిల్ రావడం అధికారుల్లో కలవరం సృష్టిస్తోంది. ఢిల్లీలో నిఘాను మరింత పటిష్టం చేయాలని పౌరులు కోరుతున్నారు.

Related posts