లోగోలో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాదీలను అవమానించడమే: కేటీఆర్
హైదరాబాద్ మే 30 (ప్రజాక్షేత్రం): కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. పదేండ్లలో సాధించిన ప్రగతిని కాదని కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరి అవలంభిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల నేపథ్యంలో మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ నాయకులతో కలిసి చార్మినార్ వద్ద కేటీఆర్ నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశ పూర్వకంగా రాజముద్రను మారుస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినారని తెలిపారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దని సూచించారు. కాగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే మార్పు చేస్తున్నదని తెలిపారు. రాజముద్రను ఇంత అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రగతిని కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ పేరు కనిపించకుండా మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోగోలో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాదీలను అవమానించడమేనన్నారు. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదని చెప్పారు. అధికారిక చిహ్నంలో మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. అమర వీరుల స్థూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన.. కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన వారి తల్లిదండ్రులు సంతోష పడరని చెప్పారు. సోనియా గాంధీ బలి దేవత అని చెప్పిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున ఎన్ని కార్యక్రమాలు పెట్టినా మర్చిపోలేని విషయం ఏంటంటే వేలాది మంది మృతులకి కారణమైన ఆ పార్టీని ప్రజలు క్షమించరని స్పష్టంచేశారు.