రాజేంద్రనగర్ లో విషాదం…గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
హైదరాబాద్ జూన్ 3 (ప్రజాక్షేత్రం): వర్షానికి నాని గోడ కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవుపల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్, ఒడిశా తదితర చెందిన పలువురు కూలీలు బాబుల్ రెడ్డి నగర్ కు వలస వచ్చి స్థానికంగా ఉన్న పారిశ్రామిక వాడలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం బాబుల్ రెడ్డి నగర్ లోని ఓ పురాతన గోడ పక్కన నలుగురు చిన్నారులు ఆడుకుంటున్నారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి గోడ నాని పోవడంతో అది కూలిపోయి చిన్నారులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 10, 11 సంవత్సరాల వయసున్న ఇద్దరు అమ్మాయిలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ మధు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.