మళ్లీ ప్రారంభమైన ప్రజావాణి.. ప్రజాభవన్కు క్యూకట్టిన జనాలు
హైదరాబాద్ జూన్ 07 (ప్రజాక్షేత్రం): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం నేడు పునః ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే గురువారంతో ఎలక్షన్ కోడ్ ముగియడంతో నేటి నుంచి ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి తెలిపారు.గతంలో వలే మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రభుత్వ దృష్టి తీసుకురవాచ్చన్నారు.
ప్రజావాణిలో వచ్చిన వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వర పరిష్కారాలు చూపాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కాగా, ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రతిరోజూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాను కూడా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తానని తెలిపారు. అయితే మొదటి రోజు మినహా ఆయన ఎప్పుడూ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం గమనార్హం. అదేవిధంగా రోజూ నిర్వహిస్తామన్న కార్యక్రమాన్ని వారంలో రెండు రోజులకు కుదించారు.