తెలంగాణ బీసీలారా అప్రమత్తంగా ఉండాలి.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను గుర్తు చేసిన ఆర్ఎస్పీ
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను సిద్ధరామయ్య సాక్షిగా కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. అయితే ఆరు గ్యారెంటీల మాదిరిగానే బీసీలను కూడా మోసం చేసే అవకాశం ఉన్నందును తెలంగాణ బీసీలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎస్పీ హెచ్చరించారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ కులగణన చేస్తామని చెప్పి, కేవలం అసెంబ్లీ తీర్మానంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సరిపెట్టింది. బీసీ కమిషన్ ఇప్పటి వరకు ఈ విషయంలో ఏం చేసిందో ఎవరికీ తెలియదు. బీసీ సబ్ ప్లాన్ జాడ కూడా లేదు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టపరమైన అడ్డంకులు పెద్దగా ఏమీ లేవని నా భావన. ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణలో బీసీల శాతం 54 శాతం అని తేలింది. దాని ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఒక ఆర్డినెన్సు ముందు జారీ చేయండి. చట్టం తరువాత తీసుకురావొచ్చు. మళ్లీ సమయం లేదంటూ బుకాయిస్తూ పాత రిజర్వేషన్లతోనే (23 శాతం) ఎన్నికలు జరిపి బీసీలను మోసం చేయాలని చూస్తే కాంగ్రెసు నాయకుల బతుకులు పల్లేర్లయితయి.. ఖబర్దార్ అంటూ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.